రైతు భరోసా, పోలింగ్ కు ముందే నిధుల జమ – ఒక్కొక్కరి ఖాతాలో రూ 6 వేలు..!?.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 10 (అఖండ భూమి న్యూస్);
_తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు అమలుకు సిద్దమైంది._
_రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కు ముందే రైతుల ఖాతాల్లో రూ 6 వేలు చొప్పున రైతు భరోసా నిధుల జమ చేసేలా కార్యాచరణ సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిధులను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది._
_తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రైతుల ఖాతాల్లో జమ ముహూర్తం ఖరారైంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నిధుల జమ పైన ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రూ.9వేల కోట్ల రుణం కోసం ఇండెంటు పెట్టింది._
_ఇందులో.. 13 ఏళ్ల కాల పరిమితితో రూ.2వేల కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో రూ.2వేల కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో రూ.2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో రూ.2,500 కోట్ల మేర రుణాన్ని తీసుకోనుంది. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశముంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ నుంచి ప్రభుత్వం ఎప్పుడూ రుణాలను సేకరించలేదు. తాజాగా సీఎం రేవంత్ రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్లను పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే స్పష్టం చేసారు._
*_మున్సిపల్ పోలింగ్ వేళ నిధుల జమ..!_*
_దీంతో.. ఇక ఇప్పుడు ఈ నిధులను రైతు భరోసా కింద విడుదలకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను సిద్ధంచేసింది. పదో తేదీన ఆర్బీఐ నుంచి ప్రభుత్వ ఖాతాలోకి నిధులు వచ్చిన వెంటనే.. 11వ తేదీన అర్హులైన వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే రోజున మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో.. పోలింగ్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో నిధుల జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం._
_కాగా.. పోలింగ్ వేళ ఈ నిధులను విడుదల చేసేందుకు రాజకీయంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఈ పథకం ఇప్పటికే అమలు చేస్తున్నది కావటంతో ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో.. పదో తేదీన ప్రభుత్వ ఖాతాల్లోకి నిధులు జమ అయిన వెంటనే.. ఈ రోజు నుంచే రైతుల ఖాతాల్లోకి నిధుల జమ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ నిధుల కోసం వేచి చూస్తున్న రైతుల కు భరోసా నిధులు జమ ఖాయంగా కనిపిస్తోంది.
You may also like
దేసేయిబీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ మృతికి సంతాపం
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న ఎన్నికల సామగ్రిని దగ్గరుండి పరిశీలించిన జిల్లా కలెక్టర్…
1.25 కోట్ల మంది హిందువులు పోరాడాలని నిర్ణయించుకుంటే…!: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!
పబ్జి ఆడుతుండగా 300 దాటిన బిపి మెదడు నరాలు చిట్లి మృతి..!
ప్రభుత్వ న్యాయవాదులకు గుడ్ న్యూస్..!


