మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని యూరియా పొందాలి…
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 16 (అఖండ భూమి న్యూస్);
రైతులు మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని యూరియా ఎరువులను పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
లింగం పేట మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
యూరియా పంపిణీలో పారదర్శకత, సౌలభ్యం కోసం అమలు చేస్తున్న మొబైల్ యాప్ ద్వారా రైతులు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. దీంతో రద్దీ తగ్గడంతో పాటు రైతులు నిర్ణీత సమయంలో ఎరువులు పొందగలరని తెలిపారు.
మొబైల్ యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంటల దిగుబడిని పెంచుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎంఎస్వో, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏఈ (ఆర్డబ్ల్యూఎస్), విద్యుత్ శాఖ అధికారులు, ఎంఈవో, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


