నకిలీ వీసాలతో మస్కట్కు వెళ్లే యత్నం.. శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళల అదుపులోకి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 03 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో ఒమన్లోని మస్కట్కు వెళ్లేందుకు ప్రయత్నించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఒమన్ ఎయిర్వేస్ విమానంలో మస్కట్కు ప్రయాణించేందుకు సిద్ధమైన మహిళల ప్రయాణ పత్రాలను తనిఖీ చేసిన అధికారులు, వారి వద్ద ఉన్న వీసాల్లో అక్రమాలు గుర్తించినట్లు సమాచారం. దీంతో వారిని వెంటనే ప్రయాణం నుంచి నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మహిళలను శంషాబాద్ ఎయిర్పోర్టు ఔట్పోస్ట్ పోలీసులకు అప్పగించారు. విచారణలో తమను ఓ ఏజెంట్ మోసం చేశాడని, ఉద్యోగాల పేరుతో నకిలీ వీసాలు ఇచ్చి విదేశాలకు పంపేందుకు ప్రయత్నించాడని మహిళలు వాపోయినట్లు తెలిసింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మహిళలను మోసం చేసిన ఏజెంట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నకిలీ వీసాల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.


