మాపై దాడి చేసి నా భార్యను ఎత్తుకెళ్లారు
బెల్లంపల్లి ఆగస్టు 14(అఖండ భూమి న్యూస్):ప్రేమ వివాహం చేసుకున్న విషయం నచ్చక,తన భార్య కుటుంబ సభ్యులు తనని తన తల్లిని,తన భార్యపై దాడి చేసి,తన భార్య సునీతని ఎత్తుకెళ్లారని రాజు అనే వ్యక్తి ఆరోపించాడు.బెల్లంపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు తన తల్లితో కలిసి హాజరై మాట్లాడారు.భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన తాను,అదే గ్రామానికి చెందిన జిల్లేల సునీత గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. తమ ప్రేమ విషయం తెలిసి సునీత కుటుంబ సభ్యులు తమను వేరు చేయాలని చూశారని,దీంతో నెల క్రితం తాము వేరే చోటికి వెళ్లి పెళ్లి చేసుకొని హైదరాబాదులో నివసిస్తున్నట్లు రాజు పేర్కొన్నారు.ఈ క్రమంలో సునీత తల్లికి ఆరోగ్యం బాలేదని మాట్లాడుకుందాం అని తమను బెల్లంపల్లికి రావాలని గ్రామ సర్పంచ్ ఫోన్ లో సూచించినట్లు తెలిపారు.కాగా శుక్రవారం తాము బెల్లంపల్లి ఏసిపి కార్యాలయానికి వెళ్ళగా,గ్రామం నుండి వచ్చిన సునీత తండ్రి,కుటుంబ సభ్యులు తనపై,తన తల్లిపై దాడి చేసి తన భార్యను ఎత్తుకెళ్లారని మొబైల్ సైతం పగలగొట్టారని ఆరోపించారు. తామిద్దరం మేజర్లమని,తీసుకెళ్లిన తన భార్యను అప్పగించాలని,లేని పక్షంలో తనకు ఆత్మహత్యే శరణ్యం అని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు…



