Ambati Rayudu: అందుకే సీఎం జగన్ను కలిశాను.. రైతులు సంతోషంగా ఉన్నారు.. విద్యావిధానం భేష్..
గుంటూరు: విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంచి మార్పులు తీసుకువచ్చిందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు..
ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్కు కూడా గుడ్బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా.. తెనాలి రూరల్ మండలం కొలకలూరులో రైతు భరోసా కేంద్రాన్ని(ఆర్బీకే) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. రైతులతో కాసేపు ముచ్చటించారు.
రైతులు సంతోషంగా ఉన్నారు
”రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాను. అన్ని ప్రాంతాలు తిరిగి విషయాలు తెలుసుకుంటున్నాను. రైతులందరూ ప్రభుత్వపరంగా తమకు మంచి మద్దతు అందుతుందని చెప్తున్నారు. తాము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు” అని అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నారు..
అందుకే సీఎం జగన్ను కలిశాను
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోందని కొనియాడారు. ఇక స్పోర్ట్స్ గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశానన్న అంబటి రాయుడు.. రాష్ట్రంలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని తమ తాత నుంచి నేర్చుకున్నానన్న అంబటి రాయుడు.. గత కొన్నాళ్లుగా ప్రజలతో మమేకమవుతూ పర్యటనలు చేస్తున్నారు..



