విక్రమ్‌ ల్యాండర్‌ను క్లిక్‌మనిపించిన నాసా ఉపగ్రహం..

వాషింగ్టన్‌: భారత్‌లో చంద్రయాన్‌-3(Chandrayaan-3) ప్రయోగానికి సంబంధించి ఇస్రో(ISRO) ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ప్రజల్లో ఆసక్తిని పెంచుతూనే ఉంది..

అయితే తాజాగా అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా)(NASA) చంద్రయాన్‌-3 ల్యాండర్‌ చిత్రాన్ని ఎక్స్‌(ట్విటర్‌)లో పంచుకుంది. తన ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్లు తెలిపింది.

‘జాబిల్లి ఉపరితలంపై ఉన్న చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఓ(లునార్‌ రికానజెన్స్‌ ఆర్బిటర్‌) స్పేస్‌క్రాఫ్ట్‌ ఫొటో తీసింది. ఆగస్టు 23న ఈ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువానికి సుమారు 600 కి.మీ దూరంలో దిగింది’ అని నాసా వెల్లడించింది. ల్యాండర్ దిగిన నాలుగురోజుల తర్వాత ఆగస్టు 27న ఎల్‌ఆర్‌ఓ ఈ చిత్రాన్ని తీసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగుతున్నప్పుడు కలిగిన రాపిడి వల్ల ఒక తెల్లని వలయం ఏర్పడిందని ఈ చిత్రాలను బట్టి తెలుస్తోంది..

చంద్రుడి ఉపరితలం 3డీ అనాగ్లిఫ్‌ చిత్రాన్ని నిన్న ఇస్రో విడుదల చేసింది. అందులో విక్రమ్‌ ల్యాండర్‌ ఉన్న ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజ్ఞాన్‌ రోవర్‌కు అమర్చిన నేవిగేషన్‌ కెమెరాలతో తీసిన చిత్రాలను ప్రత్యేక పద్దతిలో క్రోడీకరించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇస్రో ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా విడుదల చేసింది. స్టీరియో లేదా మల్టీ వ్యూ ఇమేజ్‌లను ఒకచోట చేర్చి అవి మూడు కోణాల్లో కనిపించేలా చేయడమే అనాగ్లిఫ్‌. ప్రస్తుతం నిద్రాణంలో ఉన్న ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 22న తిరిగి మేల్కొనే అవకాశం ఉందని ఇస్రో భావిస్తోంది. ఊహించినట్లు అవి పని చేస్తే.. ఇంకొన్నాళ్లపాటు పరిశోధనలు సాగించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది..

Akhand Bhoomi News

error: Content is protected !!