ఈఎంఐ కట్టలేదా? ఇక మీ ఫోన్ లాక్.. కొత్త నిబంధనలకు ఆర్బీఐ కసరత్తు..!
లోన్ కట్టకపోతే ఫోన్లు లాక్ చేసేందుకు ఆర్బీఐ సన్నాహాలు..
చిన్న రుణాల రికవరీ కోసం కొత్త మార్గదర్శకాలు..
గతంలో నిలిపేసిన విధానానికి మళ్లీ పచ్చజెండా..
వినియోగదారుడి అనుమతి తప్పనిసరి, డేటాకు రక్షణ..
బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలకు ప్రయోజనం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 12 (అఖండ భూమి న్యూస్) ఈఎంఐపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారు బకాయిలు చెల్లించడంలో విఫలమైతే, వారి ఫోన్లను దూరం నుంచే లాక్ చేసేందుకు రుణ సంస్థలకు అనుమతి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోంది. మొండి బకాయిలను తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
దేశంలో చిన్న మొత్తాల రుణాల ఎగవేతలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ ఈ చర్యలు చేపడుతోంది. గతంలో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు అనుసరించిన ఈ విధానాన్ని ఆర్బీఐ గతేడాది నిలిపివేసింది. అయితే, ఇప్పుడు రుణ సంస్థలతో సంప్రదింపులు జరిపి, పటిష్ఠమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తన ‘ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్’లో చేర్చనుంది. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ కొత్త నిబంధనలు వెలువడే అవకాశం ఉంది.