*వాహనాల నిలుపు సముదాయ షెడ్డును ప్రారంభించిన జిల్లా ఎస్పీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలోని వాహన విభాగంలో నూతనంగా నిర్మించిన వాహనాల నిలుపు సముదాయ షెడ్డును జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న పోలీస్ వాహనాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేలా, క్రమబద్ధంగా నిలిపివుంచే ఉద్దేశ్యంతోనే ఈ వాహనాలు వర్షం, ఎండ వంటి వాతావరణ ప్రభావాలకు లోనుకాకుండా భద్రంగా ఉండే విధంగా ఈ షెడ్డును నిర్మించడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ వాహనాలు తక్షణమే అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని, అందుకే ఈ వాహనాల నిలుపు సముదాయ షెడ్డును ఏర్పాటు చేసుకొని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ చర్య వల్ల పోలీస్ స్పందన వేగం మరింత పెరిగి, ప్రజలకు త్వరితగతిన సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నర్సింహారెడ్డి , మోటర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఆర్ఎస్ఐలు , ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


