సావిత్రి బాయి జన్మదినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 3 (అఖండ భూమి న్యూస్);
ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సావిత్రి బాయి జన్మదినోత్సవం వేడుకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన గావించి సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రి బాయి ఫూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. సావిత్రి బాయి ఫూలే మహిళా విద్యకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి అని, కుల వివక్ష, లింగ వివక్షలను ఎదుర్కొని బాలికల విద్య కోసం అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. మహిళలు చదువుకుంటే సమాజం ముందుకు సాగుతుందన్న దృఢ నమ్మకంతో ఆమె చేపట్టిన ఉద్యమం నేటి తరం మహిళలకు ఆదర్శమని తెలిపారు.
సావిత్రి బాయి ఫూలే విద్యా రంగంలో చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె బాటలో నడుస్తూ మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మహిళా ఉపాధ్యాయుల కృషి వల్లే విద్యా రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని అన్నారు.
అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో deo రాజు, జిల్లా అధికారులు, మహిళా ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


