*కలెక్టరేట్ లో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి వేడుకలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 11 (అఖండ భూమి న్యూస్);
స్వాతంత్ర్య పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు.
ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వడ్డె ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డె ఓబన్న చిత్రపటానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న అని కొనియాడారు. అదనపు కలెక్టర్ విక్టర్ గారు మాట్లాడుతూ రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డె ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీ.సీ సంక్షేమ శాఖ అధికారి జయరాజ్, సహాయ సంక్షేమ అధికారి చక్రధర్, ఒడ్డెర సంఘ నాయకులు ఎల్లయ్య , శ్రీనివాస్, ఆయా సంఘాల ప్రతినిధులు కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం, నరేశ్ ,పవన్, స్వామి, అశ్వాక్ , శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.


