వార్డు సభల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి…
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతానికి అందరూ సహకరించాలి..
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 6 (అఖండ భూమి న్యూస్);
ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని 40వ వార్డులో శనివారం వార్డు సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వార్డు సభలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి కుటుంబం చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి మున్సిపాలిటీకి అందించాలని సూచించారు.
“జల్ సంచయ్ – జల్ భాగీధారి” కార్యక్రమం కింద వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా మురుగు కాలువల పూడిక తొలగింపు, నీరు నిల్వ కాకుండా చర్యలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు ,వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ,
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అంటువ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్ను పొదుపుగా , సురక్షితంగా వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లా పోలీసు అధికారులు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (ఎల్బీ) ఎన్.వై. గిరి, మున్సిపల్ కమిషనర్ టి. పర్వతాలు, తహసీల్దార్ హిమబిందు, PD హౌసింగ్ విజయపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.


