వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ
– యం. రాజేష్ చంద్ర,
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 23. (అఖండ భూమి న్యూస్);
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యెల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్హెచ్ఓ నరేష్ ఎస్పీ కి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ యూనిఫాం టర్నౌట్ను పరిశీలించి, సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణ, క్రమశిక్షణ, ప్రజాసేవలపై సమీక్ష నిర్వహించారు. అధికారులకు ఇచ్చిన సూచనలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉందా లేదా అన్నది స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తదుపరి పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్, లాకప్, బ్యారెక్స్, టెక్నికల్ రూమ్, స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్ భౌగోళిక మ్యాప్, క్రైమ్ హాట్స్పాట్స్ తదితర అంశాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై ఎస్హెచ్ఓను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
అలాగే పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు విధానం, ఆన్లైన్ సిసిటిఎన్ఎస్ వ్యవస్థ పనితీరు, ఫిర్యాదుదారులను స్వీకరించే విధానం, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. ప్రతి పిటిషన్ను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యను పూర్తిగా తెలుసుకొని చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం, భద్రత, భరోసా పెంపొందేలా పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించాలని, ప్రతి విలేజ్ పోలీస్ ఆఫీసర్ తమకు కేటాయించిన గ్రామాన్ని నిరంతరం సందర్శిస్తూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై ప్రమాద హాట్స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
దొంగతనాల నివారణకు ముందస్తు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, పాత నేరస్తులు, సస్పెక్ట్ వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని, కేసుల డిటెక్షన్ను వేగవంతం చేయాలని సూచించారు.
గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, గణేష్ మండపాల వద్ద భద్రత, నిర్వాహక కమిటీలతో సమన్వయం తదితర అంశాలపై ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో యెల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్హెచ్ఓ నరేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


