Lokesh: ఉదయగిరిలో 3వేల ఎకరాలపై సజ్జల కన్ను పడింది: లోకేశ్
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉన్న 3వేల ఎకరాలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కన్ను పడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు..
యువగళం పాదయాత్ర బుధవారం ఉదయగిరి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… వైకాపా నేతలు కబ్జా చేసిన భూములన్నీ లాక్కుంటాం, వారు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తామని స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరిలో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేస్తాం, నియోజకవర్గంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పసుపు, బత్తాయి రైతులను ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
45 ఏళ్లు దాటిన పేద మహిళలకు పింఛను ఇస్తానని చెప్పి సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. ”మేం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ ఆర్థిక సాయం చేస్తాం. లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మద్య నిషేధం హామీని జగన్ విస్మరించారు. మేం గెలిచాక ప్రతి నెలా రూ. 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. వైకాపా ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. నాపై అక్రమంగా 20 కేసులు పెట్టారు.. అయినా భయపడలేదు” అని లోకేశ్ అన్నారు..



