Purandeshwari: ఎన్నికలకు ఐదారు నెలల సమయమే.. నేతలకు పురంధేశ్వరి దిశానిర్ధేశం
Purandeshwari Speech in BJP State Leaders Meeting: విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారన్నారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి అన్నారు..
ఎన్నికలకు ఐదారు నెలల సమయమే ఉందని.. అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగుల పైనా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని.. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందన్నారు. సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని.. ఓ ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తోన్న పరిస్థితి ఉందన్నారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా..? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి అన్నారు.. కానీ అలా జరగడం లేదన్నారు..



