ఈనెలలోనే తెదేపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!
అమరావతి: పొత్తు బంధాన్ని ముందుకు తీసుకెళ్లేలా తెదేపా-జనసేన వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈనెలలోనే ఇరుపార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి..
కమిటీ సభ్యుల నియామకంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించి సీనియర్ నేతలతో చర్చించారు. జనసేన సమన్వయ బాధ్యతలు నాదెండ్ల మనోహర్కు అప్పగించారు. తెలంగాణ నుంచీ ఓ సభ్యుడిని నియమించే యోచనలో జనసేన ఉంది.
త్వరలోనే తెదేపా తరఫున సభ్యుల నియామకం జరగనుంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటన దిల్లీలో కొనసాగుతోంది. ఆయన వచ్చిన తర్వాత రేపు చంద్రబాబుతో జరిగే ములాఖత్లో చర్చించిన అనంతరం తెదేపా సమన్వయ కమిటీ సభ్యులను ఆ పార్టీ ప్రకటించనుంది. రెండు పార్టీల సమన్వయ కమిటీ ప్రకటన పూర్తయ్యాక ఈనెలలోనే తొలి సమావేశం జరిగే అవకాశముంది..



