ఎస్సి వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే మాలలంతా కలసి బీజేపీని సమాధి చేస్తామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వి.ఎల్.రాజు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. వర్గీకరణకు విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని ఆయన గుర్తుచేశారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా మనువాద దోపిడీ శక్తులు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేయిస్తున్న ఎస్సీల విభజన వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, ఆతర్వాత జరిగే పరిణామాలకు బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వర్గీకరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టకూడదని ఆయన అన్నారు. వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలను కూడా వదిలిపెట్టమని డాక్టర్ వి.ఎల్.రాజు అన్నారు.హిమాయత్ నగర్ లోని పరివర్తన లా ఛాంబర్స్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందా కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ ఉద్యమం వాస్తవాలను మరుగున పరిచి, అవాస్తవాలు అనే పునాదితో కూడుకున్నదని అని ఆయన అన్నారు. తెలంగాణలో మాదిగలు విద్య, ఉపాధి, ఉద్యోగం, రాజకీయ, వ్యాపారం, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి చెంది ముందు వరసలో ఉన్నారని అన్నారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లన్నీ మాదిగలే అనుభవించారని గుర్తుచేశారు. నిజానికి మాల ఉప కులాలు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారని, మాలలకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అంటరాని జాతులన్నీ ఐక్యతతో ఉండాలన్న పిలుపు మేరకు ఎస్సి కులాలు విచ్చిన్నం కాకూడదనే ఉద్దేశ్యంతోనే వర్గీకరణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నామని ఆయన తెలిపారు. దళిత జాతి రాజకీయ అధికారం లోకి రాకుండా పూర్తిగా బానిసలుగా ఉంచాలన్న దోపిడీ కులాలు చేసిన కుట్రలతోనే ఎస్సి వర్గీకరణ వాదంను పుట్టించి పెంచి పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మాదిగ ఓటు బ్యాంకును రాబట్టుకోవడం కోసం బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ చేత వర్గీకరణ చేయిస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని డాక్టర్. వి .ఎల్. రాజు తెలిపారు. మనువాద సిద్దాంతాన్ని అమలు పరిచేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే కుట్రలకు నరేంద్ర మోడీ పాల్పడుతున్నారని ఆయన ఎండగట్టారు. బీజేపీ ఎస్సీల బౌషత్ తో రాజకీయ క్రీడలు ఆడుకుంటున్నదని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని చేసిన ప్రకటన అత్యంత సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా దళితుల విభజనకు పూనుకోవడం అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడవటమేనని ఆయన అన్నారు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్న ప్రదాని మోడీ, మంత్రి కిషన్ రెడ్డి దిష్టి బొమ్మలను తగులబెట్టాలని బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల ఉపకులాలను పెద్ద ఎత్తిన సమీకరించి లక్షలాది మందితో హైదరాబాద్ లో మాలల సత్తా చాటుతామని ఆయన ప్రకటించారు.