నగరంలో పకడ్బందీగా ‘పీ4’ సర్వే
• నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు వెల్లడి
• రెండు రోజుల్లో 18.39 శాతం సర్వే పూర్తి
కర్నూల్ రూరల్ (నగరపాలక సంస్థ) ఫిబ్రవరి 21 (అఖండ భూమి వెబ్ న్యూస్ ) :
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, పబ్లిక్ – ప్రైవేటు – పీపుల్స్ – పార్టనర్షిప్ (పీ4) సర్వేను, నగరంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని 133 సచివాలయ పరిధిలో 82,628 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉందని, శుక్రవారం సాయంత్రం నాటికి 18.39 శాతం, 15197 కుటుంబాల సర్వే పూర్తి అయిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో భాగంగా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పీ4 సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజల ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది వచ్చి, కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యులు, సంపాదన, విద్య, వృత్తి, భూములు, సాంకేతిక పరికరాలు, విద్యుత్తు సౌకర్యం, గ్యాస్ కనెక్షన్, శుద్ధజల వినియోగం, బ్యాంకు ఖాతా, ఖర్చులు, అద్దె, ఆరోగ్యం, గత ఏడాది ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ పథకాలు, వంటి వివరాలను సేకరించి, పీ4 యాప్లో నమోదు చేస్తారన్నారు. వాటి ఆధారంగానే సమాజంలో అట్టడుగున ఉన్న 20% మందికి, ఆర్థికంగా బలంగా ఉన్న 10 శాతం మంది చేయూతనిచ్చే కార్యక్రమం సక్రమంగా అమలు జరుగుతుందని, కావున వాస్తవ సమాచారాన్నే సచివాలయ సిబ్బందికి అందించాలని కమిషనర్ నగర ప్రజలను కోరారు. కాగ సచివాలయ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ పీ4 సర్వే ప్రక్రియపై సమీక్షించారు.