ప్లాస్టిక్ కవర్లు వాడకం వల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం

 

ప్లాస్టిక్ కవర్లు వాడకం వల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం

యర్రగొండపాలెం అఖండ భూమి:దోర్నాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి నలగాటి శివకోటేశ్వరరావు పత్రికా ప్రకటనలో తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా,వాడినా జరిమానా విధిస్తామని తెలిపారు.ప్లాస్టిక్ వ్యర్థాల్లో పాలిథిన్ కవర్లు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తాయని తెలిపారు.మట్టిలో కలిసి పోయేందుకు ఏళ్లకు ఏళ్లు పడుతుందన్నారు.నీరు ,భూమిలో ఇంకకుండా అడ్డు పడతాయని చెప్పారు.పాలిథిన్ కణాలు భూసారం పీల్చేస్తాయని వివరించారు.కొన్నేళ్ల తర్వాత ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతుందన్నారు.ఆ ధూళి ఒంట్లోకి వెళ్లి క్యాన్సర్, మూత్రపిండ, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు. కర్రీ పాయింట్లు అధికంగా విస్తరిస్తుండగా వారంతా నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల్లోనే వేడి వేడి ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తున్నారని చెప్పారు. అలాంటి ఆహారం తీసుకుంటే ప్రమాదకరమని గుర్తు చేశారు. కవర్ తయారీలో ఉపయోగించే పోలి ఇథలీన్ లేయర్ వేడికి కరిగిపోతుందని. అలా కలుషితమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ కారకంగా మారుతోందని తెలిపారు.ఈ నేపధ్యంలో సిల్వర్ కాయిల్తో తయారు చేసిన ఉత్పత్తుల్లో ప్యాకింగ్పై మొగ్గు చూపాలన్నారు.మహిళల్లో అధికంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్కు ఇదే కారణమని చెప్పారు.చికెన్, మటన్ దుకాణాల్లో వినియోగించే నలుపు, ఎరుపు, పింక్ రంగుల్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని తెలిపారు. వాటిలో తెచ్చే ఆహారం వేగంగా కలుషితమయ్యే అవకాశాలు ఉండటంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపి చిన్న పిల్లల్లో వేగంగా మందబుద్ధి వ్యాపిస్తుందన్నారు.విచ్చలవిడిగా వాడి పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవులు, పశువులు, పందులు తిని మృత్యువాత పడుతున్నాయని తెలిపారు.శుభ కార్యక్రమాలు,పెళ్లిళ్లలో హెచ్చు సంఖ్యలో ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. ఈ నేపధ్యంలో పాత పద్ధతులను పాటించాల్సిన తరుణం మళ్లీ ఆసన్నమైందని చెప్పారు.ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, నార సంచులు, పేపర్ బ్యాగ్లను ఉపయోగించాలని ఆయన తెలిపారు. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు విక్రయించిన వాడిన జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!