తన సంపద అంతా భారత దేశం కోసం దారబోసిన దేశభక్తుడు భారత రత్న జాకీర్ హుస్సేన్

తన సంపద అంతా భారత దేశం కోసం దారబోసిన దేశభక్తుడు భారత రత్న జాకీర్ హుస్సేన్

 

భారత 3వ రాష్ట్రపతి డా. జాకీర్ హుసేన్ (జననం: ఫిబ్రవరి 8, 1897 – మరణం: మే 3, 1969) గారి వర్ధంతి సందర్భంగా …నివాళులు అర్పిస్తూ…   నర్రా వేణు

జాకీర్ హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాదు నుండి ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని ‘ఇస్లామియా ఉన్నత పాఠశాల’ లో చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజిలో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేసేందుకు, ‘బెర్లిన్ విశ్వవిద్యాలయానికి (జర్మనీ) వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ మరియు కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిల్లియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు.

బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీతో చేతులుకలిపి, “బేసిక్ విద్య” పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నా చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు. భారత స్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.

బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో “మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం” అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు – డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.

Akhand Bhoomi News

error: Content is protected !!