తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత తొలి సభ
హైదరాబాద్:మే08 నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి.. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్.. యువతకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సోమవారం హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న సభలో ‘‘యూత్ డిక్లరేషన్’’ను ప్రకటించనున్నారు. టీఎ్సపీఎస్సీ పేపర్ లీకేజీలను, ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. తమ ప్రభుత్వం వస్తే ఏం చేయనున్నదో స్పష్టతనివ్వనున్నారు. ‘‘యువ సంఘర్షణ సభ’’ పేరిట విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై పోరాట కార్యక్రమంగా టీపీసీసీ ఈ సభను నిర్వహిస్తోంది. వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను రైతుల్లోకి ఎలా తీసుకెళ్లారో యూత్ డిక్లరేషన్ను యువత వద్దకు అలానే తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇది ప్రియాంకకు తెలంగాణలో తొలి సభ. దీంతో టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎలా కల్పిస్తుందన్నది ప్రధానంగా ప్రియాంక హామీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటించే యూత్ డిక్లరేషనే ప్రధాన ఆకర్షణ కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, టీఎ్సపీఎస్సీ పేపర్ లీకేజీని టార్గెట్ చేస్తూ టీపీసీసీ పలు కార్యక్రమాలు చేపట్టింది.
యువ సంఘర్షణ సభలో ఈ అంశంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రియాంక ద్వారా చెప్పించి.. నిరుద్యోగులను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. కాగా, సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదికపైన ప్రియాంక గంట పాటు ఉంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ప్రియాంక రావడానికి ముందే మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి తెలిపారు. మరోవైపు ప్రియాంక శంషాబాద్ విమానాశ్రయం నుంచి సరూర్నగర్ రావాల్సి ఉండగా.. షెడ్యూల్లో స్పల్ప మార్పు జరిగింది. ఆమె బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.30కు బేగంపేట చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సరూర్నగర్ స్టేడియానికి వస్తారు. ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు అందిస్తారు. తర్వాత ప్రసంగం ముగించుకుని సాయంత్రం 5.30కు హెలికాప్టర్లో బేగంపేట వెళ్లి.. అక్కడినుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతారు.
నిరుద్యోగులను ఆదుకుంటాం ఠాక్రే :-
అబ్దుల్లాపూర్మెట్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత సమస్యలను నూరు శాతం పరిష్కరిస్తుందని తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే అన్నారు. పీపుల్స్మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆదివారం పెద్దఅంబర్పేట్కు చేరుకుంది. ఔటర్ వద్ద భట్టి పాదయాత్రలో ఠాక్రే పాల్గొన్నారు. ప్రియాంక సభకు యూనివర్సిటీలు, కళాశాలల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. భట్టి మాట్లాడుతూ.. లేకలేక ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ లీకేజీల కారణంగా రద్దవడంతో యువత ఆవేదనలో ఉన్నారన్నారు.