నేడు కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎంపిక 15న ప్రమాణ స్వీకారం

 

 

బెంగళూరు ఆ కండ భూమి వెబ్ న్యూస్ :

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయ కేతనం ఎగుర వేసింది. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 136 స్థానాల్లో గెలుపొందింది. భారీ విజయంతో ఆ పార్టీ సంబురాల్లో మునిగిపోయింది. మరో వైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త ముఖ్యమంత్రి ఈ నెల 15న ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. కంఠీరవ స్టేడియంలో సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్నది ఆదివారం ఖరారుకానున్నది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానున్నది. సీఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. బెంగళూరులోని హిల్టన్‌ హోటల్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎల్పీ సమావేశం జరుగనున్నది.

డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తుందా..?

ఎన్నికల్లో ఫుల్‌ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌ పార్టీ కొత్త సీఎం ఎంపికపై దృష్టి సారించింది. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా బెంగళూరు రావాలని ఆదేశించింది. బెంగళూరులో ఆదివారం జరిగే సీఎల్పీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం ఎవరనేది హైకమాండ్‌ నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో డీకే శివకుమార్‌ పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. పీసీసీ చీఫ్‌గా ముందుండి నడిపించారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజునే డీకే శివకుమార్‌ పుట్టిన రోజు కావడం విశేషం.

పార్టీ గెలుపు కోసం కృషి చేసిన డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇస్తుందా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. లేదంటే సీనియర్‌ నేత అయిన సిద్ధరామయ్యకే మరోసారి ముఖ్యమంత్రిగా ఛాన్స్‌ ఇస్తుందా? అనే ఉత్కంఠగా మారింది. గతంలో తన పుట్టిన రోజు సందర్భంగా సోనియాకు గిఫ్ట్‌ను ప్రకటిస్తానని పీసీసీ చీఫ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. సోనియాకు కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుండగా.. ఇద్దరిలో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినా.. మరొకరు నిరాశకు గురయ్యే అవకాశం ఉన్నది. మరి కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Akhand Bhoomi News

error: Content is protected !!