ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 18 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యతను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీలు వంటి నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే రీ-వర్క్ చేయించి బాధ్యత వహింపజేస్తామని తెలిపారు.
సమావేశంలో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం, శానిటేషన్ సమస్యలు, పనుల పురోగతి వంటి అంశాలు చర్చించారు . ఎల్లారెడ్డి బస్టాండ్ పరిసరాల్లో శానిటేషన్ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు గుర్తించి, సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శుభ్రత పనులను సకాలంలో, సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
అలాగే మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులపై కూడా సమీక్ష జరిగింది. పనుల ఆలస్యానికి కారణమైన అంశాలను అధికారులతో చర్చించి, తక్షణమే వాటిని పరిష్కరించాలన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు.
ఇప్పటికే ప్రారంభించిన అన్ని అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


