కామారెడ్డి లో అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.
కామారెడ్డి పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు.
విద్యానగర్ పరిధిలోని వార్డ్ నెంబర్ 33, 34లలో జన్మభూమి రోడ్డుకు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.
ఈ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకల సమస్యలు తొలగి, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
అదేవిధంగా 46వ వార్డు చోటా కసాబ్ గల్లీలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాంతం ఎన్నాళ్లుగానో మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని అన్నారు.
“కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదు. పట్టణం అయినా, గ్రామం అయినా సమానంగా అభివృద్ధి జరగాలన్నదే మా లక్ష్యం. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి మార్గదర్శకం” అని అన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని ప్రాంతాలను గుర్తించి నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు.
కామారెడ్డి పట్టణాన్ని సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


