ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే మదన్ మోహన్ భేటీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 19 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం శాసనసభ్యులు మదన్ మోహన్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.
కాళేశ్వరం 22 ప్యాకేజీ కింద నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని శాసనసభ్యులు వినతిపత్రం అందజేశారు. అలాగే పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి కోసం (బాలురు, బాలికల కోసం మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీ గోడలు, వంటశాల షెడ్ల నిర్మాణం) నిధులు మంజూరు చేయాలని కోరారు.
వరద ప్రభావిత ప్రాంతమైన కేవైసీ రోడ్డుపై హై లెవల్ బ్రిడ్జీల నిర్మాణానికి, గాంధారి , తాడ్వాయి, మినీ స్టేడియంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కూడా ముఖ్యమంత్రికి శాసనసభ్యులు వినతి పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ప్రజలు, రైతుల తరఫున శాసనసభ్యులు ,
పోచారం ప్రాజెక్ట్ , నాగన్న మెట్ల భవి పర్యాటక ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు,
నాగిరెడ్డిపేట మండలం మల్తుమెద గ్రామంలో రూ.15 కోట్ల వ్యయంతో 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు,
నిజాంసాగర్ బ్యాక్ వాటర్స్ ఫోర్షోర్ అడవుల క్లియరెన్స్కు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు,
నాగిరెడ్డిపేట తండూర్లోని త్రిలింగ రామేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.77 లక్షల నిధులు మంజూరు చేసినందుకు
గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
శాసనసభ్యులు సమర్పించిన అన్ని వినతిపత్రాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.


