*రాజకీయ విరాళాల్లో 82% బీజేపీకే..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 14 (అఖండ భూమి న్యూస్)
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా బీజేపీకి రూ. 3,157.65 కోట్లు రాజకీయ విరాళాలుగా అందాయి. ఆ ఏడాది అన్ని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో ఇది 82.52 శాతం. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) శుక్రవారం ఓ నివేదికలో వెల్లడించింది.
20 ఎలక్టోరల్ ట్రస్ట్ సంస్థలు ఈ విరాళాలను వివిధ పార్టీలకు అందజేయగా, 5 సంస్థలు తమ వివరాలను వెల్లడించలేదని ఏడీఆర్ పేర్కొన్నది. ఆ వివరాలు కూడా బయటపడితే, బీజేపీకి వచ్చిన విరాళాలు మరింత పెరిగే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా.. 2018-2024 మధ్య కాలంలో రాజకీయ పార్టీలు విరాళాలను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరిస్తూ ఉండేవి. ఈ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరిలో రద్దు చేసింది.
అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్న కార్పొరేట్ స ంస్థలు రాజకీయ విరాళాలు ఇవ్వడానికి ఎలక్టోరల్ ట్రస్ట్ల బాట పట్టాయి. ఫలితంగా అత్యధిక రాజకీయ విరాళ దాతలుగా ఎలక్టోరల్ ట్రస్టులు నిలిచా యి. వీటిల్లో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అగ్రస్థానంలో ఉంది. ఇది 15 రాజకీయ పార్టీలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,668.46 కోట్లను విరాళాలుగా ఇచ్చింది.


