ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరదలపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణ ..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరదలపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణ ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 18 (అఖంద భూమి న్యూస్);

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విపత్తు నిర్వహణ–2026

కార్యక్రమంలో వరదలపై మాక్ ఎక్సర్‌సైజ్‌ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కౌండిల్య కాలనీలో సోమవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని వివిధ డెమోలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వరదల సమయంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, స్పందన వ్యవస్థలు, సహాయక చర్యలను సమీక్షించి మరింత మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. మాక్ డ్రిల్ ద్వారా విపత్తు నిర్వహణలో లోపాలను గుర్తించి స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు.

జిల్లాలోని 7 మండలాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. కామారెడ్డి మండలంలోని కౌండిల్య కాలనీ, బిక్నూర్ మండలంలోని రామేశ్వరపల్లి, రాజంపేట మండలంలోని గుండారం, బీబీపేట్ మండలంలోని పెద్ద చెరువు, మద్నూర్ మండలంలోని బొగ్గుగుడిసె, ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలంలోని మేజర్‌వాడ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు.

వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు, శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులు ప్రత్యక్ష సాధన నిర్వహించారు.

వరదల్లో కొట్టుకుపోయిన బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ (CPR) ద్వారా ఎలా ప్రాథమిక చికిత్స అందించాలో, అలాగే వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా రక్షించాలో డెమో ద్వారా అవగాహన కల్పించారు. సహాయక బృందాలు ప్రాణాపాయ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెస్క్యూ పరికరాల వినియోగం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

అనంతరం మాక్ డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బంది, సంబంధిత అధికారులకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రెయిన్‌కోట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి కామారెడ్డి, బీబీపేట్ పర్యవేక్షకులుగా లేబర్ శాఖ అధికారి శశికుమార్, పోలీస్ బెటాలియన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఎ సి ఎల్ బి, ఇన్‌చార్జ్ ఎన్‌వీ గిరి, డి ఎఫ్ ఓ సుధాకర్, డీసీఎం హెచ్ ఓ విజయభాస్కర్, పీడీ మెప్మా శ్రీధర్, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, యువత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని జూమ్ మీటింగ్ ద్వారా హైదరాబాద్‌లోని విపత్తు నిర్వహణ అధికారులు మానిటరింగ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!