సమాచార హక్కు చట్టం అమలుపై కమిషన్ దృష్టి సారించాలి…

సమాచార హక్కు చట్టం అమలుపై కమిషన్ దృష్టి సారించాలి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; 20 (అఖండ భూమి న్యూస్);

రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు ని ఆర్టీఐ చట్టం రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం సమాచార హక్కు చట్టం–2005 అమలులో ఉన్న పలు సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా లెగ్గేల రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయడం లేదని, ఉన్నచోట కూడా సంబంధిత అధికారుల వివరాలు ప్రదర్శించడం లేదని తెలిపారు. ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ 30 రోజుల్లో అందించాల్సిన సమాచారాన్ని అధికారులు సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దరఖాస్తుదారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, రికార్డులు లేవు, రిజిస్టర్లు లేవు అంటూ ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచాల్సి ఉండగా, అధికారులు వాటిని బహిర్గతం చేస్తున్నారని పేర్కొన్నారు.

అలాగే అనేక మంది దరఖాస్తుదారులు రాష్ట్ర కమిషన్ వరకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని కాలరాసే విధంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రతి మండల స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సమాచార కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!