గాంధారి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కురుపాటి రఘు కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కురుపాటి రఘు గుండెపోటుతో మంగళవారం ఆకస్మికంగా మరణించడం పట్ల జిల్లా పోలీసు శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఈ రోజు బాన్సువాడలోని మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘు భార్య శ్రీమతి రజిని, కుమార్తెలు రసజ్ఞ (8వ తరగతి), అమూల్య (6వ తరగతి), తల్లి చంద్రకళ గారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, 2012 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ కురుపాటి రఘు విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే పోలీస్ సిబ్బందిలో ఒకరని పేర్కొన్నారు. ఆయన మరణంతో పోలీస్ శాఖ ఒక మంచి కానిస్టేబుల్ను, కర్తవ్యనిరతిగల సహచరుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రఘు గారి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎస్పీ గారు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు.
రఘు గారి సేవలను స్మరించుకుంటూ జిల్లా పోలీసు శాఖ తరఫున ఘన నివాళులు అర్పించిన ఎస్పీ ఆయన అంకితభావం, సేవా తపన పోలీస్ శాఖలో చిరస్థాయిగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
“కర్తవ్య నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన కానిస్టేబుల్ కురుపాటి రఘు గారి సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఎస్పీ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ టౌన్ ఎస్హెచ్ఓ శ్రీధర్, బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


