ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…

ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 27 (అఖండ భూమి న్యూస్);

ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 88 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, ఇతర శాఖలకు సంబంధించిన వినతులను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు), తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, అందిన ప్రతి దరఖాస్తు పురోగతిని ఆరా తీశారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, శాఖల వారీగా బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టి, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి, చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు.

ప్రజావాణి ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జడ్పీ సీఈవో చందర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!