కామారెడ్డిలో ఒలింపిక్ డే రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 20 (అఖండ భూమి న్యూస్);
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ ఒలింపిక్ డే రన్ను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఒలింపిక్ డే రన్ను ప్రారంభించారు.
జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల, కామారెడ్డి వద్ద ప్రారంభమైన రన్ కాకతీయ నగర్లోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల వరకు కొనసాగింది. ఈ రన్లో విద్యార్థులు, క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఒలింపిక్ స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విక్టర్ ఎన్ వి గిరి, సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ డా. కె.పి. అనిల్ కుమార్, చైర్మన్ డా. ఎం. జైపాల్ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.


