మాచాపూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్…

మాచాపూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 2 (అఖండ భూమి న్యూస్);

కేంద్రం పునరుద్ధరణకు రూ.50 వేల నిధులు మంజూరు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ పంచాయతీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం సందర్శించారు. కేంద్రంలోని చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార నిల్వలు, రికార్డులను పరిశీలించి, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను తనిఖీ చేశారు. కేంద్ర భవనానికి మరమ్మతులు అవసరమని గుర్తించిన జిల్లా కలెక్టర్, తక్షణ పునరుద్ధరణ పనుల కోసం రూ.50 వేల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులను వెంటనే ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రతి కేంద్రంలో పిల్లలకు నాణ్యమైన పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.

మాచాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో మౌలిక వసతుల మెరుగుదల కోసం రూ.50 వేల నిధులు మంజూరు చేశామని, సంబంధిత అధికారులు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని, చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీడీపీఓ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, తహసీల్దార్, ఎంపీడీఓ, అంగన్‌వాడీ టీచర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!