స్నేహితుడు చెప్పాడని కారు వేగంగా నడిపి.. ఇద్దరి మృతికి..
హైదరాబాద్: తెల్లవారుజామున రోడ్డు మీద ట్రాఫిక్ లేదు.. కారు వేగంగా వెళ్తేనే మజాగా ఉంటుందని స్నేహితుడు చెప్పాడని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు..
ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్నాడు. మరో ఇద్దర్ని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేశాడు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్ బదియుద్దీన్ ఖాద్రి తన స్నేహితుడు బానోత్ గణేశ్ చెప్పడం వల్లే వేగంగా నడిపినట్లు పోలీసులకు చెప్పాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసినా బదియుద్దీన్కు అబ్దుల్ రెహమాన్ వాహనం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. డ్రైవింగ్ పక్క సీట్లో బానోత్ గణేశ్, వెనక సీట్లో మహ్మద్ ఫయాజ్, సయ్యద్ ఇబ్రహీముద్దీన్ కూర్చున్నారు. ప్రమాదం తరువాత ఇద్దరు చనిపోయారని తెలుసుకున్న నలుగురూ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు..



