శ్రీశైల క్షేత్ర పరివార ఆలయాలలో శ్రీ సాక్షి గణపతి స్వామికి విశేష అభిషేకం…….
శ్రీశైలం, మే 22(అఖండ భూమి ): లోక కళ్యాణం కోసం దేవస్థానం బుధవారం ఉదయం సాక్షి గణపతి స్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించింది. కాగా ప్రతి బుధవారం సంకటహర చవితి రోజులు మరియు పౌర్ణమి రోజులలో శ్రీ సాక్షి గణపతి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజారికాలు దేవస్థానం సేవగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఉదయం సాక్షి గణపతి స్వామి వారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గందోదకం, పుష్పోదకం,కలశోధకం,శుద్ధ జలంతోను అభిషేకం నిర్వహించబడింది.తర్వాత స్వామివారికి విశేష పుష్పార్చన నివేదన కార్యక్రమాలు జరిపించబడ్డాయి.వైదిక
సాంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో అటంకాలు తొలగి విజయం లభిస్తుందని చెప్పబడుతుంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరి, సంపదలు కలుగుతాయని ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచన శక్తి పెరిగి, విద్య బాగా వస్తుందని చెప్పబడుతోంది. కాగా శ్రీశైల క్షేత్ర పరివాల ఆలయాల్లో సాక్షి గణపతి ఆలయానికి ఎంత విశిష్టత ఉంది.భక్తులు శ్రీశైల మహా క్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో, పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి.అందుకే ఈ స్వామి సాక్షి గణపతిగా పేరు పొందాడు. చక్కని నల్లరాతితో మల్చబడిన ఈ స్వామి ఒక చేతిలో కలం, మరో చేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.