ప్రకృతి తో అనుబంధం పెంచుకోండి
సమాజాన్ని ప్రేమించడం నేర్పిస్తుంది.జియో అధినేత రామకృష్ణ
శృంగవరపుకోట 19 :
గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) స్వఛ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ ఉన్నత పాఠశాల మైదానం చుట్టూ బుధవారం 50 మొక్కలు నాటారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.టి.సి.డిపో మేనేజర్ కోటంశెట్టి రమేష్ మాట్లాడుతూ మొక్కలు పెంచడమును విద్యార్థి దశ నుండే ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. ప్రకృతి తో అనుబంధం పెంచుకోండి, సమాజాన్ని ప్రేమించడం నేర్పిస్తుంది అని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.జగదీశ్వర రావు మాట్లాడుతూ రెండువందల చెట్లు పెంచడాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు స్వఛ్చందంగా సహకరించాలని కోరారు. జియో వ్యవస్థాపకుడు బి.రామకృష్ణ మాట్లాడుతూ ఫలసాయాన్నిచ్చే చెట్లు ప్రతీ పాఠశాల, కళాశాల ఆవరణలో నాటి సంరక్షణ బాధ్యతను స్థానికులకు అప్పగించి, ఫలసాయంలో వారికి కూడా భాగస్వామ్యం కల్పించినట్లయితే పర్యావరణ పరిరక్షణతో పాటు ఫలసాయ ఉత్పత్తికి, ఆర్థిక పరిపుష్టికి తోడ్పడగలమన్నారు. ఫలాపేక్ష కారణంగానైనా నూరు శాతం చెట్లు రక్షించబడగలవని అన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వేమలి గోవింద, ఫిజికల్ డైరెక్టర్ జి.లక్ష్మణరావు, ఉపాధ్యాయులు యన్.రఘు, దుర్గా లక్ష్మి, సుభాన్ బే, రమేష్ కుమార్, వాసుదేవరావు, రాజు, కృష్ణవేణి, నరసింహ రావు, మల్లేశ్వర రావు, గురునాధం, విద్యార్థులు పాల్గొన్నారు.